BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అందినకాడికి ఏది దొరికితే అది అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దురాశకు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) బలిపశువులుగా మారాయి. గడిచిన పదేండ్ల మోదీ హయాంలో పీఎస్యూల్లోని వాటాల విక్రయంతో ఖజానాకు రూ.5 లక్షల కోట్లు సమకూరాయి. దీని కోసం చట్టంలోని నిబంధనల్ని ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేసింది. ఏటికేడూ అంచనాలకు మించి లాభాలను గడిస్తున్న కంపెనీలు.. నష్టాల ఊబిలోకి కూరుకుపోయినట్టు కట్టుకథలు ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పీఎస్యూలు చెల్లిస్తున్న డివిడెండ్ల లెక్కలను విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడానికే కేంద్రం ఈ విధంగా చేసిందని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.
కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ల రూపంలో చెల్లిస్తాయి. గడిచిన పదేండ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్యూల్లో) రూ.5 లక్షల కోట్ల వాటాలను మోదీ సర్కారు విక్రయించినప్పటికీ, ఇంకా ఆయా సంస్థల్లో కేంద్రానికి వాటాలు మిగిలే ఉన్నాయి. దీంతో తాము గడించిన లాభాల్లో సీపీఎస్యూలు కేంద్రానికి ఏటా చెల్లింపులు చేస్తూ వస్తున్నాయి. అయితే కేంద్రం బడ్జెట్ అంచనాలకు మించి సీపీఎస్యూలు డివిడెండ్లు చెల్లిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు.. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను సీపీఎస్యూల ద్వారా కేంద్రం అంచనా వేసిన డివిడెండ్ రూ.34,717 కోట్లు. కానీ ఆయా సంస్థలు రూ.39,750 కోట్లు (12.6 శాతం ఎక్కువ) చెల్లించాయి. ఆ మరుసటి ఏడాది 28 శాతం అధికంగా ఇచ్చాయి. ఈ మేరకు యూనియన్ బడ్జెట్ పత్రాలు-దీపమ్ వెల్లడించాయి. లాభాలు గడించనిది.. సీపీఎస్యూలు ఇంత పెద్దమొత్తంలో ప్రభుత్వానికి డివిడెండ్లు ఎలా చెల్లించగలవని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న కేంద్ర ప్రభుత్వం మాటలు అబద్ధాలని ధ్వజమెత్తుతున్నారు.
ఏ కంపెనీ అయిన తమ శాఖలను విస్తరించడానికి.. వచ్చిన లాభాలను పెట్టుబడుల రూపంలో మళ్లిస్తాయి. అయితే, సీపీఎస్యూల విస్తరణను వ్యతిరేకిస్తున్న కేంద్రం వాటిని ప్రైవేటీకరించడానికే పట్టుబడుతున్నది. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏ సీపీఎస్యూ అయినా.. వచ్చిన లాభాల్లో 30 శాతాన్ని (పన్నులు కాకుండా) లేదా నికర విలువలో 5 శాతాన్ని.. ఈ రెండింట్లో ఏది ఎక్కువ అయితే దాన్ని, కేంద్రానికి డివిడెండ్ల రూపంలో చెల్లించాలని నిబంధన తీసుకొచ్చింది. దీంతో ఏటికేడు లాభాలు గడిస్తున్నా.. కేంద్రం కొర్రీలతో సీపీఎస్యూలు విస్తరణకు నోచుకోవడంలేదు. నిబంధనలకు లోబడి గత ఎనిమిదేండ్లలో సీపీఎస్యూలు రూ.3,25,132 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. దీన్నిబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కారు ఎంతగా తెగనమ్ముతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ గురించి 1991-92 మధ్యంతర బడ్జెట్లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు 1991-99 మధ్యకాలంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.17,557 కోట్లు ఆర్జించాయి.
1999 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వం రూ.27,599 కోట్లు.. 2004-14 మధ్య రెండుసార్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రూ.1.33 లక్షల కోట్లు రాబట్టుకొన్నాయి.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పీఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆకాశమే హద్దుగా సాగింది.
2014-19లో మోదీ సర్కారు పీఎస్యూల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు పిండుకొన్నది. ఆ తర్వాత 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మరో రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించింది. అంటే గత పదేండ్లలో మొత్తం రూ.5 లక్షల కోట్లు (ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకొంటే రూ.6.5 లక్షల కోట్లు) రాబట్టుకొన్నదని అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , డీఐపీఏఎం చెప్పాయి.