సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ) : పేద ప్రజలు నివసిస్తున్న నివాసాల రెగ్యులరైజ్తో వారి జీవితాల్లో వెలుగులు నింపేలా అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ డివిజన్లో 2304 మందికి 2,07,449 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చామని, ఇందులో 1740 స్థలాలకు సంబంధించి రెగ్యులరైజ్ కోసం జీవో 816 కింద దరఖాస్తులు రాగా, 1472 రెగ్యులరైజ్ చేశామన్నారు.
ఇంకా 56 స్థలాలు నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోవడంతో, 215 స్థలాలకు సంబంధించి కోర్టులో కేసులు, ఇతర కారణాలతో 511 స్థలాల రెగ్యులరైజేషన్ పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేయనున్నందున అప్పటి ధరను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో గత 50 ఏండ్లుగా ఎంతోమంది పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నారని, తమ స్థలాలను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నారని, వారి సమస్యలకు పరిషారం చూపాలన్నారు.
పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నారని, అందులో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర సమాచారాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి, సమావేశం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరలో జరగనున్న క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై సమీక్షించేందుకు ముందస్తు సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
హైదరాబాద్ పరిధిలో ఎకడెకడ లీజుపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ స్థలాలు ఉన్నాయి.. ఎవరి ఆధీనంలో ఉన్నాయనే సమగ్ర సమాచారం సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఎప్పుడో నిర్ణయించిన లీజు ధరను ప్రస్తుత మారెట్ ధరలకు అనుగుణంగా పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మున్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కలెక్టర్ శర్మన్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్ రావు, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణ, ఆర్డీఓలు వసంత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.