బేగంపేట్ మార్చి 25: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే మహనీయుడు సీఎం కేసీఆర్ అని, రాష్ర్టాన్ని దేశానికే అదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట్ డివిజన్లోని బేగంపేట్ ప్యాలెస్లో స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మహేశ్వరి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ పాల్గొని తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రజల గురించి ఎంతో గొప్పగా ఆలోచించే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన అందరి అదృష్టమన్నారు.
గృహలక్ష్మి పథకంతో..
పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉచితంగా అందించి పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి అన్నారు. సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి త్వరలోనే గృహాలక్ష్మి పథకం కింద 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 500 ఉన్న పింఛన్ను 2016కు పెంచి లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.
మన బస్తీ-మన బడి ద్వారా..
మన బస్తీ-మన బడి’ ద్వారా కార్పొరేట్ స్థాయిలో సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ సర్కారు స్కూళ్లలోనే విద్యనభ్యసించే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. బేగంపేట్ డివిజన్లో నాలా పరివాహక ప్రాంతాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ. 45 కోట్లతో బ్రహ్మాండంగా నాలా అభివృద్ధిని చేస్తున్నట్టు తెలిపారు. పాటిగడ్డలో 6 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
తాగునీటి కష్టాలు తీరిపోయాయి..
గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి ఇబ్బందులు ఉండేవని, రాష్ట్రం ఏర్పడ్డాక మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తాగునీటి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. నీళ్లు నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలో నూతనంగా పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరును దేశం మొత్తం అనుసరిస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి సాయికిరణ్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కట్టెల శ్రీనివాస్యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్లు ఉప్పల తరుణి, శేషుకుమారి పాల్గొన్నారు.