హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ డివిజన్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా గోల్నాక డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్ లో మొక్కలను నాటిన అనంతరం స్థానికంగా గల నాలాలో పూడిక తొలగించే పనులను పరిశీలించారు. నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో డ్రైనేజీ పైప్ లైన్, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాలలోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే బీజేపీ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నిజాం కాలంలో నిర్మించిన నాలాలను అభివృద్ధి చేయాలని గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ? అని మంత్రి ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో SNDP కార్యక్రమం కింద నగరంలోని నాలాలలోపూడిక తొలగింపు, అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాలాను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించి అభివృద్ధి నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు.