హైదరాబాద్ : ఈ నెల16 వ తేదీన నిర్వహించే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం ఓల్డ్ సిటీ కి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు 16 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు గత ప్రభుత్వాలు అరకొర ఏర్పాట్లు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని వివరించారు.
ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలానే ఆలోచనతో వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని వివరించారు. ఓల్డ్ సిటీలో ని దేవాలయాలకు ఈ నెల 10, 11 తేదీల్లో ఆర్ధిక సహాయం చెక్కులను అందజేస్తామని అన్నారు. ప్రయివేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహకులు ఏర్పాట్లపై అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షులు భాస్కర్, మాజీ అధ్యక్షులు గాజుల అంజయ్య, రాకేశ్ తివారి, మధు యాదవ్, రాజరత్నం, సదానంద్ యాదవ్, మధు గౌడ్, హన్స్ రాజ్, వీరేంద్ర యాదవ్, గాజుల గబ్బర్, రాందేవ్ కుమార్ అగర్వాల్, మింటు తివారి తదితరులు పాల్గొన్నారు.