హైదరాబాద్ : అక్టోబర్ 2 న సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేస్తున్న గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం, బన్సీలాల్ పేటలోని మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాంధీ హాస్పిటల్ ముందు 16 అడుగుల ధ్యానంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ పరిసరాలను ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగిన ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద కూడా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, పనులు ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ రెండు విగ్రహాలను కూడా అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభిస్తామన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, కల్పన పాల్గొన్నారు.