హైదరాబాద్ : ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) వెల్లడించారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని MG రోడ్డులో రాంగోపాల్ పేట డివిజన్ వార్డు ఆఫీస్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్పూర్లో స్థానిక MLA ముఠా గోపాల్తో కలిసి వార్డు ఆఫీస్, అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్నగర్లో స్థానిక MLA కాలేరు వెంకటేష్తో కలిసి వార్డు ఆఫీస్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన తమ సమస్యల పరిష్కారం కోసం వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. వార్డు ఆఫీస్ వ్యవస్థ వలన GHMC పరిధిలోని GHMC, ఎలక్ట్రికల్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు అంతా ఒక్క చోట ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులకు కూడా ప్రజల నుంచి వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. GHMC పరిధిలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున గతంలో 137 వార్డు ఆఫీసులను ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 13 ఆఫీసులను ఈరోజు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.