హైదరాబాద్ : నగరంలోని బేగంపేట ఓల్డ్ కస్టమ్ ప్రాంతంలో ముస్లిం గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి రూ.3 కోట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani ) అన్నారు. నిర్మాణ పనులను జులై 1 వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో బేగంపేట కు చెందిన ముస్లిం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్మశానవాటిక నమూనా ను జీహెచ్ఎంసీ (GHMC) ఈఈ సుదర్శన్ వివరించారు.
ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో తెలియని అయోమయ పరిస్థితులను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు . తమకు స్థలం కేటాయించాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతున్నా గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచి గెలిచి ముఖ్యమంత్రి, మంత్రిగా పని చేసిన నాయకులు సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని అన్నారు.
మంత్రి మాట్లాడుతూ బేగంపేట పరిధిలో ఉన్న ముస్లింలకు గ్రేవ్ యార్డు(Graveyard) లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు. సమస్యను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) దృష్టికి తీసుకెళ్లగా ఓల్డ్ కస్టమ్లో 2 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు మంత్రిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బేగంపేట డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, బేగంపేట కు చెందిన ముస్లిం ప్రతినిధులు సలీం ఖాన్, నవాబ్, మక్బూల్, అబ్బాస్, వాహీద్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.