తెలంగాణ సంస్కృతిని చాటే బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రూ.15 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించింది. గోల్కొండ అమ్మవారికి తొలి బోనంతో జూన్ 22 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభమవుతుండగా, జూలై 9న లష్కర్, 16న పాతబస్తీ బోనాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం, ముఠాగోపాల్, అరెకపూడి గాంధీ, కాలేరు వెంకటేశ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ హాజరయ్యారు. ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, 26 ఆలయాలకు పట్టువస్ర్తాలను సమర్పిస్తున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించింది. రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న గోలొండలో బోనాలు ప్రారంభం అవుతుండగా, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ప్రతి ఏటా తరహాలో ఈ ఏడాది కూడా ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో ఆషాఢ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి తలసాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
స్వరాష్ట్రంలో గొప్పగా బోనాల పండగ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తూ వస్తున్నామని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బోనాల ఉత్సవాలను ఎంతో సంతోషంగా, ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో అనేక ప్రైవేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ విధంగా దేశంలో ఎకడా ఏ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం లేదని తెలిపారు. బోనాల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్ల కోసం సుమారు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా నగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించి మొకులు చెల్లించుకుంటారని చెప్పారు. వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఆలయాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఊరేగింపు నిర్వహించే రహదారులు, ఆలయాలకు వెళ్లే రహదారుల్లో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను కూడా త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని నియమిస్తామని, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను బోనాల ఉత్సవాల కోసం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మఫ్టీ పోలీసులు, షీ టీంలను బందోబస్తు విధుల కోసం నియమించనున్నట్లు పేరొన్నారు. స్వచ్ఛందంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్లను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.
26 ఆలయాలకు పట్టువస్ర్తాలను సమర్పిస్తాం
బోనాల ఉత్సవాల సందర్భంగా గోలొండలోని జగదాంబిక ఆలయంలో, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ లోని అకన్న- మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు మంత్రి చెప్పారు. ఉజ్జయిని మహంకాళి, అకన్న -మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల ఆహ్లాదం కోసం వివిధ సాంసృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని గుర్తు చేశారు.
వైభవంగా బోనాలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు బోనాల పండుగ సరిగా జరపలేదని, తెలంగాణా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వైభవంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్ల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, అరెకపూడి గాంధీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, డీఎస్ చౌహాన్, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.