సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేరిందని మంత్రి తలసాని పేర్కొన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గృహలక్ష్మి పథకంపై నగర ప్రజాప్రతినిధులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమం కింద ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు వివరించారు. గృహలక్ష్మి పథకం నిరంతర కార్యక్రమం అని, అర్హులైన వారికి గుర్తించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారిని గుర్తించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ఇండ్లు నిర్మించుకునేందుకు ఖాళీ స్థలాలు లేవని, ప్రస్తుతం ఉన్న ఇంటిపైన మరో నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో చర్చిస్తానని మంత్రి తలసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అబిడ్స్, ఆగస్టు 10 : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సచివాలయంలో నగర బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేష్, అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్లు సీహెచ్ ఆనంద్కుమార్ గౌడ్, నందకిషోర్ వ్యాస్ బిలాల్, ఠాకూర్ జీవన్సింగ్, బాక్రి, ఆజం అలి, రాంరెడ్డి, సలాఉద్దీన్ లోది, శ్యాంసుందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, ముఖేష్సింగ్, పరమేశ్వరిసింగ్, రాంచందర్ రాజు, మిత్ర కృష్ణ, బంగారి ప్రకాశ్, ఆకుల రూప, లాస్య నందిత, ముఖ్య నాయకులు సంతోష్ గుప్తా, ఎం ఆనంద్కుమార్ గౌడ్, ఆల పురుషోత్తం రావు, ఎస్ ధన్రాజ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.