Minister Srinivas Yadav | తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మీకు కనిపిస్తలేవా? అంటూ ప్రశ్నించారు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నర సంవత్సరాల నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల బాగోగుల గురించి ఆలోచించే గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఆలోచనలతోనే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించినట్లు వివరించారు. లబ్ధిదారుడిపై పైసా భారం పడకుండా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేసిందన్నారు.
45సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా నేడు ఎన్నికలు వస్తుండడంతో అది చేస్తాం ఇది చేస్తామని వస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నంత కాలం పదవులను కాపాడుకోవడం, తమ వారి బాగుకోసమే కాంగ్రెస్ నాయకులు పరితపించారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన పాలన సాగుతుందని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దేశంలోనే పెద్ద కదలికను తీసుకువస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కోసం ప్రజల నుండి డిమాండ్ రాబోతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.