Minister Srinivas Yadav | కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కేటాయించలేని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కు మద్దతుగా బోరబండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండుసీట్లు గెలిచిన పార్టీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తారని ప్రశ్నించారు.
మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే బీజేపీ, కల్లబొల్లి మాటల కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని.. విశ్వనగరంగా రూపుదిద్దుకుందన్నారు. ఐటీరంగం, పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయని.. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. దేశంలోనే ప్రముఖ నగరాల జాబితాలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపట్టి.. ప్రజల కష్టాలను తొలగించిందన్నారు. కొత్త కాలనీలు, బస్తీలు ఏర్పడడం, జనాభా పెరగడంతో పెరిగిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ను భారీ మెజారిటీ గెలిపించాలని ఓటర్లను కోరారు.