హైదరాబాద్ : రహదారులను ఆక్రమించి.. వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, తక్షణమే ఆక్రమణలను తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సనత్నగర్లోని జెక్ కాలనీలోని గాంధీ విగ్రహం నుంచి సనత్ నగర్ మెయిన్ రోడ్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. మొదట గాంధీ విగ్రహం వద్ద పాక్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉండే ఎర్రగడ్డ ఫతేనగర్ రోడ్డు వెంట పలు చోట్ల ఆక్రమణలు జరగడమే కాకుండా ప్రతి ఆదివారం నిర్వహించే సంతతో రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగించడం కష్టమవుతుందని, ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో సమస్య శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, గాంధీ విగ్రహం పక్కనే ఉన్న సబ్ స్టేషన్ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
నిరుపయోగంగా ఉన్న సబ్ స్టేషన్ స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం కేటాయిస్తే, అందుకు ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న మరో స్థలాన్ని కేటాయిస్తామని సంబంధిత అధికారులకు సూచించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోడ్డు వెంట ఉన్న ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తొలగించాలని, రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగించాలని ఆదేశించారు. ఆక్రమణలను తొలగించిన అనంతరం రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. డివైడర్లను నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు.
గోకుల్ థియేటర్ ఎదురుగా జెక్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఉన్న ఆక్రమణలను కూడా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేశ్, ఏసీపీ గంగారాం, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, సీయూ ముత్తు యాదవ్, ట్రాఫిక్ సీఐ నరహరి, విద్యుత్ ఏడీ అమర్నాథ్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.