హైదరాబాద్ : గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మనగర్లో రూ.83లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు, రాంనగర్ డివిజన్లోని బాకారంలో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను, భోలఖ్పూర్లో రూ.4.32 కోట్ల వ్యయంతో ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం కింద చేపట్టనున్న ప్రభుత్వ హైస్కూల్ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్తో కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. అలాంటి గ్రంథాలయాలు నిరాధరణకు గురికావడంతో సరైన సౌకర్యాలు, వసతులు లేక ఇబ్బందులుపడేవారని, తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాలకు పూర్వవైభవం తెస్తుందన్నారు. నగరంలో 82 గ్రంథాలయాలు ఉండగా.. వాటిలో శిథిలావస్థలో ఉన్న, అద్దెభవనాల్లో ఉన్న 12 గ్రంథాలయాలకు రూ.8కోట్ల వ్యయంతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మూడు గ్రంథాలయ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ప్రధాన గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు సమకూర్చడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమం చేపట్టామన్నారు.
ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.32 కోట్ల కేటాయించిందని, ఇవాల ఆ పనులను ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డీఈవో రోహిణి, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కార్యదర్శి పద్మజ, కార్పొరేటర్లు రచన శ్రీ, రవి చారి, బీఆర్ఎస్ నాయకులు ముఠా జయ సింహ, ఎడ్ల హరిబాబు యాదవ్, ఎంఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.