చిక్కడపల్లి, ఆగస్టు 16: సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా బహుజనులను అవమాన పర్చిన వారిని వదిలిపెట్టమని, వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బహుజనులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారనే అక్కస్సుతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహుజనులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లిలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంస్థ(టీటీసీఎఫ్సీ)చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్, తదితరులు హాజరైన పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పాపన్న జీవిత చరిత్రను భావితరాలకు తెలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బహుజనులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. బహుజనులు కన్నెర్ర చేస్తే రేవంత్ రెడ్డితో పాటు బహుజనుల వ్యతిరేకులు కనుమరుగైపోతారని, రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కూడా ఇదే విధంగా మాట్లాడారని గుర్తుచేశారు. భయపెడితే భయపడే జాతి బహుజనులది కాదని.. తలచుకుంటే వంద రోజుల్లో రాజకీయంగా కనుమరుగవుతావని హెచ్చరించారు. సింగల్ రూంలో ఉంటూ.. గోడల మీద పెయింటింగ్ వేసుకున్న రేవంత్ రెడ్డికి అన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇలానే మాట్లాడితే తిరిగి పెయింటింగ్ వేసుకునే పరిస్థితి వస్తుందని సూచించారు. బహుజనులను కించపరుస్తున్న రేవంత్ రెడ్డిని వెంటాడి వెంటాడి భూస్థాపితం చేయాలి పిలుపునిచ్చారు. ఇకనుంచైనా నోరు అదుపులోపెట్టుకోవాలని రేవంత్రెడ్డికి సూచించారు.