ముషీరాబాద్, జనవరి 30 : కార్పొరేట్ శక్తులను పెంచిపోషించడమే లక్ష్యంగా కేంద్రం ట్రాయ్ని అడ్డుపెట్టుకొని కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ట్రాయ్ని అడ్డుపెట్టుకొని కేంద్రం చేస్తున్న కుట్రలను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద ట్రాయ్ అసంబద్ద నిబంధనలను వ్యతిరేకిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ర్టాల కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య పాల్గొని కేబుల్ ఆపరేటర్ల ధర్నాకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతులను చేసిన చరిత్ర కేబుల్ ఆపరేటర్లదని, లక్షల మందికి ఉపాధినిస్తున్న కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను కాపాడాల్సిన కేంద్రం నీరుగార్చే కుట్రలకు పూనుకోవడం శోచనీయమన్నారు. పేదల కష్టాలు, బతుకులకు అంబానీ, అదానీల చేతుల్లో పెట్టే కుట్రలు సాగుతున్నాయని, ట్రాయ్ అసంబద్ధ నిర్ణయాలతో రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. మీడియా సంస్థలను తమ చేతుల్లో పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కృషి చేస్తానన్నారు. కేబుల్ ఆపరేటర్లకు తగిన సౌకర్యాలు, గుర్తింపు కార్డులు ఇచ్చేలా తనవంతు కృషి చేస్తానని అన్నారు. కేబుల్ ఆపరేటర్ల ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. ఎంపీ బుడుగుల లింగయ్య మాట్లాడుతూ.. ట్రాయ్ కొత్తగా తీసుకొస్తున్న నిబంధనలు ఆపరేటర్ల వ్యవస్థను నాశనం చేసేలా ఉందని మండిపడ్డారు. లక్షలాది మంది జీవితాలతో కూడుకున్న కేబుల్ వ్యవస్థను కాపాడటానికి కేంద్రం వెంటనే తన చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కేబుల్ ఆపరేటర్స్ జేఏపీ కన్వీనర్ సురేశ్, ప్రధాన కార్యదర్శి కిశోర్, సుభాష్రెడ్డి, ఉపేందర్, అంజిరెడ్డి, రమేశ్, జితేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.