హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళా సంస్కృతిలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉన్నదని, అందువల్లే ఒక్కో హస్తకళను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, నిధులు, వనరులు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ శాఖ గురువారం నుంచి 9వ తేదీ వరకు గిరిజన కళలను ప్రదర్శించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చిత్రలేఖనాలు, హస్తకళల ప్రదర్శనను మంత్రి తిలకించారు. గోండ్, కోయ, నాయక్పోడ్, లంబాడి, ఓజ, కోలామ్, కోయ, ఎరుకల స్టాళ్లను పరిశీలించి వాటి విశేషాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్చోంగ్దూ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ సంచాలకలు విట్టా సర్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గిరిజన వైద్యమూలికలు, పచ్చబొట్లు, 7న గిరిజన సంగీతం, మౌఖిక సాహిత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. 9న గిరిజన ఆహారాలను ప్రదర్శించడంతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.