బడంగ్పేట, జూన్ 4 : దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై గ్రామాల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆర్సీఐ రోడ్డు నుంచి నందనవనం వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.1.20కోట్లు, రాఘవేందర్ నగర్ నుంచి గాయిత్రీనగర్ రోడ్డు విస్తరణ పనులు రూ.65లక్షలు, అంబేద్కర్ నగర్ నుంచి గ్రాయిత్రీనగర్ వరకు రోడ్డు విస్తరణకు రూ.60లక్షలు, ఆటోస్టాండ్ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు విస్తరణకు రూ.85లక్షల పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారుల విస్తరణ పూర్తి కావస్తున్నాయన్నారు. లింక్ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయడానికి నియోజకవర్గం వ్యాప్తంగా రూ.18.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
ప్రజలకు అన్ని సరుకులు ఒకే చోట లభించే విధంగా చొరవ తీసుకుంటున్నామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న అన్ని గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే చందన చెరువును నూతన హంగులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మంత్రాల చెరువు, పెద్ద చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. డ్రైనేజీ నీరు చెరువులో కలువకుండా రూ.23కోట్లతో ప్రత్యేక ట్రంక్లైన్ ఏర్పాటుకు చేయడం జరిగిందన్నారు. దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్, డీఈ గోపీనాథ్, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, గజ్జల రాంచందర్, సిద్దాల బీరప్ప, అనిల్ కుమార్, నవీన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, దిండు భూపేశ్ గౌడ్, తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో యువతకు ఉజ్వల భవిష్యత్
పహాడీషరీఫ్, జూన్ 4 : బీఆర్ఎస్ పార్టీలో యువతకు ఉజల భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన యంజాల అర్జున్కు బీఆర్ఎస్ పార్టీ జల్పల్లి మున్సిపాలిటీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి ఆదివారం నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి కో- ఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి వాసుబాబు, బీఆర్ఎస్ యువత సయ్యద్ ఇద్రీశ్, చంద్రం చారి, పరమేశం, బాలరాజు, యాదయ్య, జగన్రాజ్, సిద్ధు, అను, సందీప్, అక్బర్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.