ప్రచార పర్వంలో కారు టాప్గేరులో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బీఫాంలు అందుకున్న అభ్యర్థులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పదేండ్ల అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ వాడవాడలా పర్యటిస్తున్నారు. గులాబీ బాస్ ఆదేశాలు పాటిస్తూనే సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీల వెన్నులో ఓటమి భయం కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచా రం చేయాలన్న గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాల ప్రకారం అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా సాగుతూ లబ్ధిదారులు, వారి కుటుంబాలతో పాటు ప్రజల నుంచి ఆశీర్వాదం పొందుతున్నారు. ప్రతి ఓటరుకు చేరువయ్యేలా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.. చేసిన అభివృద్ధిని, సంక్షేమంతో బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో వివరిస్తూ స్థానికులతో మమేకం అవుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందం టూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థులకు వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు.. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. దాదాపు రెండు నెలలు గులాబీ శ్రేణుల ప్రచార శైలితో పాతనగరం మినహా అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు నిశ్చయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాబోయే రోజుల్లో మిగిలేది కంఠశోషలు, కాళ్లనొప్పులేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.