బడంగ్పేట, మార్చి 21: ఏప్రిల్ 20 తేదీ లోపు జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వైఆర్ గార్డెన్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచి రెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు. ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంబురాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 25న నియోజక వర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని, 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, పట్నం మహేందర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి, సత్తు వెంకటరమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.