ఆర్కేపురం, జూన్ 8: స్వరాష్ట్రంలో చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గతంలో చేపల కోసం ఇతర ప్రాంతాల పై ఆధారపడేవాళ్లమని, నేడు మన చెరువుల్లోనే చేపలు పుష్కలంగా లభిస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా 27 వేల పై చిలుకు చెరువుల్లో 10వేల కోట్లు ఖర్చు పెట్టి పూడికతీత పనులు చేపట్టి సత్ఫలితాలు సాధించామని తెలిపారు. నాడు ఎండిన చెరువులు… నేడు ఎండాకాలంలో కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయన్నారు. గంగ పుత్రులు, ముదిరాజ్ కులస్తుల కోసం 2016-17లో 45 చెరువుల్లో ఉచితంగా చేపలు వదిలే కార్యక్రమం చేపడితే నేడు జిల్లాలో 765 చెరువుల్లో చేప పిల్లలు, రొయ్యలు వదులుతున్నట్లు తెలిపారు.
గతంలో ఉన్న సొసైటీలకు అదనంగా కొత్త సొసైటీలు స్థాపించి ఆదాయం వారికే దక్కేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ 75 శాతం సబ్సిడీతో రూ.900 కోట్లతో వాహనాలు సమకూర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేసిందన్నారు. గతంలో 5వేల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అయితే నేడు 9 వేల టన్నులు ఉత్పత్తి అవుతున్నదని… రూ.138 కోట్ల ఆదాయం వస్తున్నదన్నారు. అనంతరం స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీష్ అధికారి సుకృతి, సరూర్నగర్ తాసీల్దార్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.