బడంగ్పేట్, నవంబర్ 5 : యువత సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గర్జన కార్యక్రమానికి మంత్రి సబితారెడ్డి హాజరై ప్రసంగించారు. దేశంలో ఏ పార్టీకి లేనంత యువశక్తి బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. సీఎం కేసీఆర్ సైతం యువతను అక్కున చేర్చుకొని అసెంబ్లీ, పార్లమెంట్తోపాటు కార్పొరేషన్లలో అవకాశాలు కల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ఉద్యోగాల జాతర కొనసాగిందని, ఇప్పటికే లక్షా 60వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయగా.. మరో 70వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో పురోగతిలో ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్రంలోని బీజేపీ మాటలు ఒట్టిమాటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ను రద్దు చేస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఫ్యాక్స్ కాన్ను తెలంగాణ నుంచి తరలించే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాలతోపాటు అనేక విద్యా సంస్థలను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకొని విద్యా హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామన్నారు. కేంద్రం ఇవ్వకున్నా.. జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటును చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూనే.. ప్రైవేటు రంగంలో 24లక్షల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన యువతకు ధన్యవాదాలు తెలిపారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ భారీగా తరలివచ్చిన యువతను చూస్తేనే మహేశ్వరంలో సబితక్క గెలుపు ఖాయమైనట్లు స్పష్టమవుతుందన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి సబితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, యువజన విభాగం మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు పవన్కుమార్, సభాధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్రెడ్డి, కౌశిక్రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ సమీపంలోని లలిత చౌరస్తాలో నిర్వహించిన యువ గర్జన కార్యక్రమం సక్సెస్ అయ్యింది. యువ ప్రభంజనంతో ఆ ప్రాంతం గులాబీమయమైంది. ఈ కార్యక్రమానికి ముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.