బడంగ్పేట, నవంబర్ 3 : మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ఆదర్శహిల్స్ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400లకే గ్యాస్ ఇస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద మూడు వేలు, 3 లక్షల మందికి తెల్లరేషన్ కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలు, బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.832 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ట్రంక్లైన్, నాలాల ఏర్పాటుతో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చేయడానికి రూ.280 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టినట్లు తెలిపారు. పైపులైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 13 బస్తీ దవాఖానలు, 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కార్పొరేటర్లు నవీన్ గౌడ్, భూపాల్ రెడ్డి, బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు జంగయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కామేశ్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.