బడంగ్పేట, నవంబర్ 24 : కులమతాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని, వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తూర్పార పట్టాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం జరిగిన మహేశ్వరం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ అనేక కుతంత్రాలు చేస్తుందని మండిపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డు పెట్టుకొని కక్షపూరితంగా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఇంటిని సోదా చేయడానికి 400 నుంచి 600 మంది పెట్టుకొని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. అడ్డుకోలేరని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు ఇక్కడ సాగవన్నారు. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన త్యాగం ఇక్కడి ప్రజలకు గుర్తుందని చెప్పారు.
బీజేపీ చేస్తున్న కుట్రలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ర్టాన్ని, టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని బీజేపీ తప్పుడు ప్రచారం చేయిస్తున్నదని, వారి పిట్ట బెదిరింపులకు ఇక్కడ బయపడేవారు ఎవరూ లేరని తెలిపారు. అదే సోషల్ మీడియా వేదికగా బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తూర్పార పట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి కొత్త మనోహర్ రెడ్డి, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.