బడంగ్పేట, నవంబర్ 27: బాలాపూర్లో రోడ్ షో కార్యక్రమానికి సోమవారం విచ్చేసిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి బడంగ్పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దళిత బహుజనులంతా సబితమ్మకు మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. బ్లూ తలపాగాలు చుట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా గజమాల వేసి అంబేద్కర్కు నివాళులర్పించారు. ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన మహిళలు మంత్రికి హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. బాలాపూర్ అంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శేఖర్ మాట్లాడుతూ పార్టీలకు సంబంధం లేకుండా డిప్యూటీ మేయర్ కావడానికి పూర్తి స్థాయిలో సహకరించిందన్నారు.
అంత పెద్ద సహాయం చేసిన మంత్రికి ఆమె రుణం తీర్చుకోవాలన్న ఉద్ధేశంతో దళిత బహుజనులంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి తమ వంతు బాధ్యత నెరవేర్చుతామన్నారు. మంచి చేసిన వారిని ఎవరు మర్చి పోకూడదన్నారు. మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధి కావాలంటే మరోసారి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో మహేశ్వరం అన్ని విధాలుగా మంత్రి అభివృద్ధి చేశారు కనుకనే అభివృద్ధి చేసిన వారికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బలహిన వర్గాలకు న్యాయం జరగాలంటే సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. మాట మీద నిలబడే మంత్రికి ఈనెల 30న కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, గిరీష్, కొప్పుల రాజు, ఎల్లరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దళిత బహుజన నాయకులు తదితరులు ఉన్నారు.