సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
వేసవిలో నగరవాసులకు ప్రజలకు తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బ్యారేజీల్లో ఉన్న నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని సూచించారు. వేసవి కాలంతో పాటు రానున్న రంజాన్ నెలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంకర్లు 24 గంటలు తిరగడానికి అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించారు. మోటార్లు 24 గంటలు నడిచేలా..కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి 10 టీఎంసీ ల నీటిని ఉపయోగించుకోవాలని హైదరాబాద్ తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.
ఎల్లంపల్లి నీళ్లు సిద్దిపేట , గజ్వేల్ , దుబ్బాకకు ఇవ్వకుండా మొత్తం హైదరాబాద్కి తీసుకెళ్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇందులో వాస్తవం లేదన్నారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాలు ఉండకుండా ఆస్తి , ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వేసవిలో టి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయని తెలిపారు. 245 స్టాటిక్ టీమ్స్తో పాటు 30 డీఆర్ఎఫ్ బృందాలు,147 మొబైల్ టీమ్స్ ఉన్నట్లు చెప్పారు.ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి కమిషనర్ సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.