మేడ్చల్ రూరల్, జూలై 3: విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించినప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెహగల్ ఫౌండేషన్, మజ్జిగ తిరుపతిరెడ్డి సహకారంతో రూ.30 లక్షల నిధులు వెచ్చించి ఆధునీకరించిన తరగతి గదులు, ఫర్నిచర్, మరుగు దొడ్లు, క్రీడా మైదానాన్ని మంత్రి మల్లారెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు తెలంగాణలో ఎక్కడా చూసినా అభివృద్ధే కనపడుతున్నదని, గత తొమ్మిదేండ్లకు పూర్వం విద్య, వైద్య రంగం చాలా కష్టతరంగా ఉండేదని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక రూ. 7003 కోట్లు నిధులతో ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను, తరగతి గదులు, వంట గదులు, ఫర్నిచర్ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో అన్నం అందిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కూడా ప్రవేశపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
నేటి పిల్లలు చాలా తెలివి గలవారని, వారు అద్భుతాలు సృష్టించే సత్తా ఉన్న పిల్లలు అని, తమ స్కిల్ను, టాలెంట్ను చదువు మీద పెట్టి జీవితంలో ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయులు కష్టపడి చదువు చెప్పుతున్న చదువును పిల్లలను అర్థం చేసుకుని అందుకనుగుణంగా ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు పేదవారు ఉండొచ్చు, కాని పిల్లలు చదువులో పేదవారు కాదని, విద్యార్థులు నిరంతరం చదువుపై దృష్టి పెడితేనే.. గొప్పవారవుతారని తెలిపారు. చదవుతేనె మంచి ఉద్యోగాలు వస్తాయని, చదవుకున్న వారికే మంచి అవకాశాలు ఉన్నాయని, సీఎం కేసీఆర్ సకల అవకాశాలు కల్పించారని చెప్పారు. చదువులో ముందుండాలి, ఆటల్లో కూడా ముందుండాలని సూచిస్తూ, విద్యార్థులు చదువుపైనే దృష్టిపెట్టి ఇంటిలో సెల్ఫోన్లు, టీవీలను చూడకూడదని తెలిపారు.
పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన సెహగల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమ అనంతరం, సర్పంచ్ బాబు యాదవ్ సొంత ఖర్చులతో విద్యార్థులకు షూలను పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాబు యాదవ్, ఎంపీపీ రజితా రాజ మల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్, ఎంపీటీసీ రఘు, వార్డు సభ్యులు శశి కుమా ర్, శ్రీకాంత్, మాణిక్యం, ఉమారాణి, నాగేష్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు డప్పు కృష్ణ, నాయకులు రాజమల్లారెడ్డి, వెంకటేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.