ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 2 : విద్య, వైద్యానికే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల పంచాయతీ పరిధిలోని జడ్పీ పాఠశాల ఆవరణలో రూ.85 లక్షల నిధులతో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం, డైనింగ్ హాలు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు వెయ్యి గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యనందిస్తున్న ఘనత దేశంలో తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 7 వేల 300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావడంతో సీట్లు దొరకడం లేదన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని దేశంలో తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుందన్నారు. పేద రోగులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 10వేల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద దవాఖానలలో అత్యాధునిక పరికరాలను సమకూర్చి పేదలకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మండల సహకార సంఘం చైర్మన్ రాంరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, ఎంపీడీవో అరుణ, సర్పంచ్లు కొంతం వెంకట్ రెడ్డి, గీతా శ్రీనివాస్, రమాదేవి రాములు గౌడ్, ఎంపీటీసీ వినోద, ఉప సర్పంచ్ కందుల రాజు, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.