ఘట్కేసర్ రూరల్, జనవరి 6 : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అంకుషాపూర్లో ఎన్ఎఫ్సీనగర్ నుంచి అంకుషాపూర్ వరకు రూ. కోటి 50 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రతి పల్లెను పట్టణాల తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు.
రైతును రాజు చేయాలనే సంకల్పంతో 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ప్రభుత్వం చేయూతనందించడం ద్వారా దేశానికే అన్నదాతగా తెలంగాణ ఎదిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, సర్పంచ్లు జలజా సత్యనారాయణ రెడ్డి, బైరు రమాదేవి రాములు గౌడ్, సురేశ్, ఎంపీటీసీ కొమ్మిడి శోభ దామోదర్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ రమాదేవి మహిపాల్ గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, మాజీ అధ్యక్షుడు కందుల కుమార్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, నాయకులు రవి, వేణు, రాజేశ్, శశికళ, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అద్దంలా రోడ్లు
కీసర, జనవరి 6 : తెలంగాణ ప్రభుత్వ హయాంలో రోడ్లకు కోట్లాది రూపాయలు వెచ్చించి అద్దంలా తయారు చేస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల పరిధిలోని బోగారం ఆర్అండ్బీ రోడ్డు నుంచి కీసరగుట్ట శ్రీపాదాల వరకు ఎంఎంఆర్ నిధులైన రూ.30లక్షలతో బీటీ రోడ్డు, అంకిరెడ్డిపల్లి నుంచి కేశ్వాపూర్ వరకు రూ.కోటితో బీటీ రోడ్డు పనులకు శుక్రవారం మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రోడ్లన్ని నేడు సర్వాంగ సుందరంగా మారాయని, రోడ్లకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని అన్నారు. నిరుపేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెలుగింటి ఆడపడుచుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్శర్మ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో మంగతాయారు, కీసర పంచాయతీ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
మంత్రికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు
మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిలను కీసర మండల ప్రజాప్రతినిధులతో పలువురు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ పండుగ కవితశశికాంత్, బీఆర్ఎస్ నేతలు మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, శశికాంత్లతోపాటు పలువురు వారిని కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.