శామీర్పేట, సెప్టెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో చేపట్టిన ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై 180 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 9 ఏండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పల్లెలన్నీ పట్టణాలుగా మారాయని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా అర్హులందరికీ పింఛన్ అందజేస్తున్నామని తెలిపారు. నిరంతర విద్యుత్, ఇంటింటికీ భగీరథ నీరు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనితలాలయ్య, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్లు గీతమహేందర్, జాము రవి, భాస్కర్, ఎంపీటీసీలు ఇందిరా, నాగరాజు, తాసీల్దార్ సత్యనారాయణ, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నందుగౌడ్, చంద్రకాంత్రెడ్డి, రాజు, కుమార్, బాబు, రవికాంత్రెడ్డి, శైలేశ్ గౌడ్, అనిల్గౌడ్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, భరత్, వెంకట్రెడ్డి, రవీందర్, మంద స్వామి, రమేశ్యాదవ్, పవన్ముదిరాజ్, చాంద్పాషా, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
బొమ్మరాశిపేట గ్రామంలో 384 పట్టాలనువిడతల వారీగా అందజేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితాలని, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పట్టాలు సంక్షేమ నిధులని చెప్పారు. వెంటనే ఇంటి పర్మిషన్ వస్తుందని, గృహలక్ష్మి పతకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాలనీలు ఏర్పాటు తర్వాత తన సొంత నిధులతో డ్రైనేజీ, రోడ్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అంటేనే దగుల్బాజీలని మంత్రి నిప్పులు చెరిగారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెసోళ్లు కండ్లెర్ర చేస్తున్నారని విమర్శించారు. పట్టాలు ఎవరిచ్చారని కాదు.. పట్టాలతో ప్రజలకు మేలు జరిగిందా..? లేదా.? అనే విషయాన్ని గుర్తించాలన్నారు. 9 ఏండ్ల కింద చేయనోళ్లు.. ఇప్పుడు తాను చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పూటకో మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడం తప్ప.. వారి మొకానికి ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. 70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశానికి ఉద్దరించింది ఏమిటని ప్రశ్నించారు. పింఛన్ తీసుకునేటోడు చస్తేనే.. రూ.200 పింఛన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఫవర్ హాలిడేలు, గుక్కెడు నీటికోసం ట్యాంకర్ల వద్ద కొట్లాటలు.. ఇదీ ఆ పార్టీల పాలన అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. మాయమాటలు చెప్పి ఓట్ల కోసం ఏ పార్టీ నేతలు వచ్చినా.. తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.