మేడ్చల్, జూలై13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుధవారం ఘన స్వాగతం లభించింది. 13 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికేందుకు జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్పోర్ట్కు తరలివెళ్లారు.
ఎయిర్పోర్టు నుంచి బోయిన్పల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డిని కార్మిక శాఖ అడిషనల్ డైరెక్టర్ గంగాధర్, ఈఎస్ఐ వైద్యాధికారి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.