Bansilalpet Metla Bavi | చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బన్సీలాల్పేట మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మెట్ల బావిని కాపాడుకోవాల్సిన, సంరక్షించుకునే బాధ్యత స్థానికులదే. చెత్త పారేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా స్థానికులదే. మెట్ల బావిని కాపాడుకుంటూ హైదరాబాద్ నగరానికి స్ఫూర్తిగా నిలవండి అని కేటీఆర్ స్థానికులకు పిలుపునిచ్చారు. బన్సీలాల్పేట్ మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గత 13 నెలల నుంచి అహర్నిశలు శ్రమించి బన్సీలాల్పేట మెట్ల బావికి కొత్త వైభవాన్ని అందించిన వారందరికీ అభినందనలు తెలిపారు. టన్నుల కొద్ది చెత్తను మీ స్వహస్తాలతో తీసి ఇంతటి అందమైన కానుకను హైదరాబాద్కు అందించిన పారిశుద్ధ కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులకు హృదయపూర్వకంగా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
ఈ ఎనిమిదేండ్ల కాలంలో హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, ఇతర పనులు ప్రారంభించుకున్నాం. కానీ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ఇవాళ అట్లాంటి సందర్భం ఉంది. ఒక నగరం, పట్టణం.. స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు. నగరం చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించిన వాళ్లం అవుతాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
43 మెట్ల బావులను ఆధునీకరిస్తామని మేయర్ చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. బన్సీలాల్ పేట మెట్ల బావి నిర్మాణ పనులను 25 సార్లు వచ్చి పరిశీలించానని తలసాని చెప్పారు. స్థానికులకు ఈ బావి ప్రత్యేకత వివరించి, దీన్ని చాలా కష్టపడి పునరుద్ధరించామని తలసాని తెలిపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. దీని వెనుకాల శ్రమ ఎంతో దాగుంది. 3,900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. 863 ట్రిపుల్లో లారీల్లో చెత్తను తరలించారు. రూ. 10 కోట్లతో సుందరీకరించారు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ బావిని భవిష్యత్ తరాలు గుర్తించుకునే విధంగా ఆధునీకరించారు. పర్యావరణహితంగా, వాస్తుపరంగా నిర్మించారు. నీరు ఉబికి వచ్చేలా ఈ అద్భుత నిర్మాణానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కులీకుతుబ్షాహీ టూంబ్స్ వద్ద సీఎం నేతృత్వంలో ఆరు మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ వారు ఆధునీకరించారు. వాటికి యునెస్కో నుంచి అవార్డు వచ్చింది. అదే విధంగా మొజాం జాహీ మార్కెట్, మీరాలం మండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్ పేట్ సరాయి, వీటన్నింటిని ఇంతే అద్భుతంగా పూర్వ వైభవం సంతరించుకునేలా ఆధునీకరిస్తాం. హైదరాబాద్లో మన చరిత్రకు, వారసత్వానికి, మన గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే వీటిని పునరుద్ధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా కూడా గుర్తింపు తెస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.