దేశంలోనే అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకుపోతున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ల సంయుక్తాధ్వర్యంలో మంగళవారం దండుమల్కాపూర్లోని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పారిశ్రామిక ప్రగతి వేడుకలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని 51పరిశ్రమలను ప్రారంభించడంతోపాటు 106ఎకరాల్లో ప్రతిపాదిత టాయ్స్ పార్క్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, లింగయ్య, సునీతా మహేందర్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఐఎఫ్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.
– హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ)
స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు
వెక్కిరించిన వాళ్లే నోళ్లు వెళ్లబెట్టేలా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్నది. టీఎస్ ఐపాస్ విధానాలతో తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. నేడు దండుమల్కాపూర్ పారిశ్రామిక పార్క్లో 51 పరిశ్రమలను ప్రారంభించడంతో నిరుద్యోగ యువతకు వరంలా మారింది. ఎన్నో ఏండ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కనున్నది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఇక్కడి స్థానిక యువతకే 70-75 శాతం ఉద్యోగాలు కల్పించాలని పారిశ్రామిక వేత్తలను కోరడంతో యువత భవితకు భరోసానిచ్చినట్లయింది. అంతేకాదు ఇక్కడికి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉండటంతో సుమారు 40 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.