సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో విడతల వారీగా డబుల్ బెడ్ రూం ఇండ్ల జాతర జరగనుంది. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ విడతల వారీగా అందిస్తున్నది. ఇప్పటికే దాదాపు 4,500 ఇళ్లను ఆయా బస్తీలకు చెందిన నిరుపేదలకు పంపిణీ చేశారు. అనేక ప్రాంతాల్లో ఏకంగా 65వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తవడంతో లబ్ధిదారుల ఎంపికను కొలిక్కి తీసుకువచ్చారు. దీంతో తొలి విడతలో 30 వేలు, రెండో విడతలో మిగిలిన ఇండ్ల పంపిణీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆదివారం చారిత్రక తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తొలి సంతకం డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై చేశారు. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో కలిసి త్వరలో వరుసగా గృహ ప్రవేశాల జాతరకు శ్రీకారం చుట్టబోతున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.