హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ, నేడు తెలంగాణ చేసింది రేపు దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన మంత్రి 8000మంది టీ-ప్రైడ్ లబ్ధిదారులకు రూ.562కోట్ల రాయితీలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఉత్తమ దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎంపీ వెంకటేశ్ నేత, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి,రేఖానాయక్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, సీఐఐ చైర్మన్ శేఖర్ రెడ్డి, హ్యాండ్లూమ్స్ కార్యదర్శి బుద్ధప్రకాశ్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు.