KTR | హైదరాబాద్ : రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నారని వివరించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స్ (సమన్వయ)సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ నది సుందరీకరణ, నది ఒడ్డున ట్రామ్, మంచిరేపుల నుంచి నాగోల్ గౌరెల్లి వరకు స్కై వేతో పాటు మూసీ నదిపై 14 చోట్ల బ్రిడ్జిల నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించనున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 2 బీహెచ్కె లబ్దిదారులకు ఇండ్ల పంపిణీ జరగనుందని, సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భేషజాలకు వెళ్లకుండా ఏ శాఖ అధికారులైనా జీహెచ్ఎంసీ అనుమతి తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ పెద్దన్న పాత్ర పొషిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించి, జోనల్ పరిధిలోని అంశాలను అక్కడే పరిష్కరించుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండి దానకిషోర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, టీఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు, జీహెచ్ఎంసి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.