హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రజలకు హుస్సేన్ సాగర్ వద్ద అద్బుతమైన థీమ్ పార్క్ ( Thrill City Theme Park ) అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నెక్లెస్ రోడ్ ( PV మార్గ్ ) లో నూతనంగా ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో కూడిన థ్రిల్ సిటీ థీమ్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన రైడింగ్ మాన్ స్టార్ థియేటర్, స్ప్లాష్ కోస్టర్, ఫ్లైట్ సిమ్యులేటర్లు, స్కోడా కార్ డైవర్, ట్రైనింగ్ సిమ్యులేటర్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్సాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేకమైన గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్ ఇలా మొత్తం తిరిగారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించే విధంగా థ్రిల్ సిటీ థీమ్ పార్క్ ను నిర్మించి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఎమ్మెల్యేలు ధానం నాగేందర్, సుభాష్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాజీ హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, థ్రిల్ సిటీ డైరెక్టర్ రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.