హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారు. బీజేపీ కార్పొరేటర్ల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారు. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Some thugs & hooligans of BJP in Hyderabad have vandalised the GHMC office yesterday. I strongly condemn this atrocious behaviour
— KTR (@KTRTRS) November 24, 2021
Guess it’s too much to ask Godse Bhakts to behave in a Gandhian manner
Request @CPHydCity to take strictest action on the vandals as per law pic.twitter.com/0Ogg0IzLZS
బీజేపీ కార్పొరేటర్ల నిరసనను ఖండిస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిసరాలతో పాటు లోగోను పాలతో శుభ్రం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ధర్నాను టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. బీజేపీ ధర్నా జీహెచ్ఎంసీ చరిత్రలో చీకటి రోజు అని కార్పొరేటర్లు పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్కు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. అభివృద్ధిని చూసి బీజేపీ కార్పొరేటర్లు ఓర్వలేకపోతున్నారు అని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలని టీఆర్ఎస్ కార్పొరేటర్లు వార్నింగ్ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం దాడికి పాల్పడ్డ విషయం విదితమే. కార్యాలయంలో కనిపించిన వస్తువునల్లా ధ్వంసంచేస్తూ వీధి రౌడీల్లా ప్రవర్తించారు. పక్కా పథకం ప్రకారం తమ అనుచరులతో ఆఫీస్లోకి ప్రవేశించిన కార్పొరేటర్లు మొదటి అంతస్తులోని మేయర్ చాంబర్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. భద్రతాసిబ్బంది అడ్డుకోవటంతో కమిషనర్ చాంబర్వైపు పరుగులు పెడుతూ పూలకుండీలు, కుర్చీలను ధ్వంసంచేశారు. కార్యాలయంలోని మైక్లను విరిచేశారు. అద్దాలు పగులగొట్టారు. మైలార్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి జీహెచ్ఎంసీ లోగోపై ఇంకును స్ర్పే చేశారు. బీజేపీ కార్పొరేటర్ల బీభత్సంతో మేయర్, డిప్యూటీ మేయర్, కార్యదర్శి భయంతో చాంబర్ల తలుపులు మూసుకున్నారు. కార్పొరేటర్లు చిల్లర గూండాల్లా భవనమంతా పరుగులు పెట్టడంతో కార్యాలయ సిబ్బంది బేంబేలెత్తిపోయారు. బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత వారించినా కార్పొరేటర్లు వినిపించుకోకపోవడంతో పోలీసులు వచ్చి పలువురు బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లను అరెస్టు చేసి సైఫాబాద్, రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు న్యూసెన్స్ చేయడం, ప్రజా ఆస్తుల నష్టం కలిగించారని జీహెచ్ఎంసీ అధికారులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బీజేపీ కార్పొరేటర్లు పక్కా ప్రథకం ప్రకారమే జీహెచ్ఎంసీపై దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నదని తెలిసినా, సమస్యలు వినేందుకు మేయర్ అపాయింట్మెంట్ ఇచ్చినా విధ్వంసం సృష్టించాలన్న ఏకైక లక్ష్యంతోనే కార్యకర్తలతో కలిసి వచ్చి హల్చల్ చేశారు. ప్రజా సమస్యలను చర్చించటానికి ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలున్నా దాడులతో భయానక వాతావరణం సృష్టించారు.