నగరం నలువైపులా అభివృద్ధి వికేంద్రీకరణ
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ. 2.5వేల కోట్లతో అభివృద్ధి
రూ. 103.25 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు
రూ. 672 కోట్లతో ఫైఓవర్లు, అండర్పాస్ రోడ్ల నిర్మాణం
జీవో నం. 58, 59లను సద్వినియోగం చేసుకోవాలి
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
కే. తారకరామారావు
మన్సూరాబాద్/ఎల్బీనగర్, మార్చి 16: ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నగరంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి నాగోల్ బండ్లగూడ చెరువు వద్ద ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన వరదనీటి కాలువ పనులకు, ఎల్బీనగర్ రింగ్రోడ్డులో నూతనంగా నిర్మించిన అండర్ పాస్ రోడ్డు, బైరామల్గూడ చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ను బుధవారం ఆయన హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి కోసమే రూ. 103.25 కోట్లు మంజూరు చేశామని, పనులన్నీ మే నెల చివరి వారంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. 1908వ సంవత్సరం తర్వాత అక్టోబర్ 2020న పడిన భారీ వర్షాన్ని ఎవరూ మరువలేరని చెప్పారు. భారీ వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమయమైన విషయం తెలిసిందేనని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి చేపట్టాల్సిన కార్యాచరణను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీ తరహాలో ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి) కార్యక్రమాన్ని చేపట్టి, మొదటివిడతలో రూ.985 కోట్లతో వరదలు వచ్చిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన నాలాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు.
ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్..
ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్గా చేసేందుకు ఎస్ఆర్డీపీ ద్వారా ఫ్లైఓవర్లు, ఆండర్పాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నియోజవర్గంలోనే రూ. 672 కోట్లతో ఫైఓవర్లు, అండర్పాస్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా బాగ్ హయత్నగర్లో 252, జై భవానీనగర్లో 324, కర్మన్ఘాట్లో 80 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలోనే వీటిని ప్రజలకు అందజేస్తామని చెప్పారు. అలాగే ఇక్కడి ప్రజల దాహార్తి తీర్చేందుకు 47.5 ఎంఎల్డీ సామర్థ్యంతో 12 రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే 13 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు సచివాలయనగర్లో రూ. 5.68 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫతుల్లాగూడలో జంతు సంరక్షణ కేంద్రం రూ. 4 కోట్లతో, సాహెబ్నగర్లో రూ. 4.58 కోట్లతో శ్మశానవాటిక, చంపాపేటలో 2.68 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను నిర్మించినట్లు చెప్పారు. ఇలా ఒక్క ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే రెండున్నర వేల కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఎమ్మెల్యే గారూ.. నాలాల వద్ద మార్నింగ్ వాక్ చేయండి
– మంత్రి కేటీఆర్
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మార్నింగ్ వాక్ విషయంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని ప్రశంసించారు. మీరు బాగా మార్నింగ్ వాక్లు చేస్తారు అంటూనే.. ఇకపై వరదనీటి నాలా పనులు పూర్తయ్యే వరకు ఆయా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేయలని సూచించారు. ఈ నాలా పనులను సకాలంలో పూర్తి చేయించి ఈ సారి నియోజకవర్గంలో ముంపు సమస్య రాకుండా చూడాలని కోరారు.
జీవో నం.58,59 మళ్లీ తెచ్చాం..
నగరంలో ఇప్పటికే లక్ష మందికి పట్టాలు ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తిరిగి మరోసారి జీవో నెం. 58, 59ని తీసుకువచ్చామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మన బస్తీ.. మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజనీర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.