జీహెచ్ఎంసీలో నాలాల విస్తరణ, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణకు నష్టపరిహారంగా నగదు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు టీడీఆర్ సర్టిఫికెట్లు పొందిన వారికి రూ.3095 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్లు ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జీహెచ్ఎంసీలో టీడీఆర్ డిమాండ్ పెరగడాన్ని నీతిఆయోగ్ ప్రశంసించిందని, ఇతర రాష్ర్టాలు కూడా పాటించాలని సూచించినట్లు తెలిపారు. టీడీఆర్ బ్యాంకు వివరాలు http//tdr.ghmc.telangana.gov.in:8080/ద్వారా తెలుసుకోవచ్చు. క్రయ,విక్రయాల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్లు మంత్రి తెలిపారు.