బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 23 : గాంధీ దవాఖానలో(Gandhi Hospital) డ్రైనేజీ లీకేజీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంగా శుక్రవారం ఆయన సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానాకు వచ్చారు.
అదే సమయంలో భవనంపై నుంచి డ్రైనేజీ లీకేజీలను గమనించారు. దానిపై గాంధీ దవాఖాన సూపరిం టెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ దవాఖాన నిర్మించి 20 ఏండ్లు పూర్తి అయ్యిందని, పాత పైపులైన్లు శిథిలావస్థకు చేరాయని అన్నారు. గత ప్రభుత్వం ఇందుకోసం రూ.14.80 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు.
టెండర్లను ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు మొదలుకాలేదని తెలిపారు. ఈ లోగా ఎన్నికలు రావడంతో కొంత జాప్యం నెలకొన్నదన్నారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డితో చర్చించి, ఇంజినీరింగ్ విభాగం అధికారులను పంపించి డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నివారణ చర్యలు తీసుసుకుంటామన్నారు.