ముంబై : ముంబై తీరం వద్ద.. ఆరేబియా సముద్రంలో ఉన్న పీ305 నౌక మునిగిన విషయం తెలిసిందే. అయితే వారం ముందే తౌక్టే తుఫాన్ గురించి హెచ్చరికలు అందినట్లు ఆ బార్జ్కు చెందిన చీఫ్ ఇంజినీర్ తెలిపారు. పీ305 బార్జ్ నౌకలో మొత్తం 37 మృతదేహాలను ఇండియన్ నేవీ రెస్క్యూ బృందం వెలికి తీసింది. కానీ ఆ బార్జ్ కెప్టెన్ ఒకవేళ తుఫాన్ హెచ్చరికలు పాటించి ఉంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదు అని ఆ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న చీఫ్ ఇంజినీర్ రెహ్మాన్ షేక్ తెలిపాడు. ప్రభుత్వం ఇచ్చిన తుఫాన్ వార్నింగ్ను బార్జ్ కెప్టెన్ బల్విందర్ సింగ్ సీరియస్గా తీసుకోలేదని చీఫ్ ఇంజినీర్ రెహ్మాన్ ఆరోపించాడు. బార్జ్ పీ305 నుంచి మొత్తం 188 మందిని రక్షించారు. బార్జ్ ప్రమాదానికి కెప్టెన్, కంపెనీ తప్పుడు అంచనాలే కారణమని రెహ్మాన్ తెలిపాడు. నౌకలోని ఇంకా 30 మంది ఆచూకీ లేరు. ఐఎన్ఎస్ కొచ్చి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నది.
వారం క్రితమే సైక్లోన్ వార్నింగ్ అందిందని, చాలా వరకు నౌకలు తమ ప్రాంతం నుంచి తీరానికి వెళ్లిపోయాయని, మనం కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్దామని కెప్టెన్ బల్విందర్ సింగ్ను కోరానని, కానీ అతను తన మాటలను పట్టించుకోలేదని రెహ్మాన్ అన్నాడు. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కన్నా అధికంగా ఉండదని కెప్టెన్ చెప్పాడని, ఒకటి రెండు రోజుల్లో తుఫాన్ ముంబై తీరాన్ని దాటుతుందని చెప్పాడని, కానీ నిజానికి గాలి వేగం గంటకు వంద కిలోమీటర్లు దాటిందని, ఆ ధాటికి తమ నౌక సముద్రంలో నిలువలేకపోయిందని షేక్ తెలిపాడు.
ప్రస్తుతం రెహ్మాన్ ముంబైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కానీ బార్జ్ కెప్టెన్ మాత్రం ఇంకా ఆచూకీ చిక్కలేదు. ఆరేబియా సముద్రంలో ఉన్న ఓఎన్జీసీ రిగ్గుల వద్ద పనిచేస్తున్న కార్మికులకు బార్జ్ నౌకలు ఆశ్రయ కేంద్రాలుగా ఉంటాయి. అయితే తౌక్టే తుఫాన్ ధాటికి పీ305 బార్జ్ సముద్రంలో మునిగిపోయింది. లైఫ్ జాకెట్లు వేసుకున్న వారు మాత్రం సముద్రంలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో నౌక మునిగినట్లు రెహ్మాన్ చెప్పాడు. నీటిలో ఎక్కువసేపు ఉండడం.. భయం.. షాక్ వల్ల చాలా మంది చనిపోయినట్లు అతను తెలిపాడు.