నిమ్స్ నర్సులకు తేల్చిచెప్పిన ప్రభుత్వం
ఇప్పటికే అన్ని డిమాండ్లు నెరవేర్చాం
వేతనాలు నాలుగు రెట్లు పెంచాం
రోగులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి హరీశ్రావు హితవు
సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, కార్మిక శాఖ కమిషనర్తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిమ్స్లో నర్సుల ఆందోళన విషయం గత నెల 28న మంత్రి హరీశ్రావు దృష్టికి రాగానే వెంటనే స్పందించారు. సమస్యలు పరిష్కరించాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు. దాంతో హెల్త్ సెక్రెటరీ, నిమ్స్ యాజమాన్యంతో కలిసి నర్సులతో అదే రోజు పలు దఫాలుగా చర్చలు జరిపారు. వారు అడిగిన వెంటనే ఎన్హెచ్ఎం కాంట్రాక్టు నర్సులతో సమానంగా 30 శాతం వేతనం పెంపు, పే స్లిప్స్, వెయిటేజీ, ఏరియర్స్, రెగ్యులర్ రిక్రూట్మెంట్లో అవకాశం కల్పించారు. ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టు నర్సుల మాదిరిగానే మెటర్నిటీ లీవ్ బెనిఫిట్స్ వర్తింపచేసేందుకు ఒప్పుకున్నారు. ముఖ్యమైన డిమాండ్లపై 24 గంటల్లోనే సానుకూల ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా వేతనాలు పెంచాలంటూ ఆందోళన…
అన్ని డిమాండ్లు నెరవేర్చినా నర్సులు ఆందోళన విరమించలేదు. పైగా.. మాట మార్చి రెగ్యులరైజ్ చేయాలని, ఇంకా వేతనాలు పెంచాలంటూ మొండికేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్రావు మంగళవారం మరోసారి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ నర్సులను 2010లో స్టూడెంట్ ఇంటర్న్లుగా తీసుకున్నారని, అప్పుడు వారికి 8వేలు మాత్రమే ఇచ్చేవారని తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి వేతనాన్ని నాలుగు రెట్లు పెంచి రూ.32 వేలు చేసింది. వారి సర్వీస్ను స్టాఫ్ నర్స్ కాంట్రాక్టు సర్వీస్గా గుర్తించి, రెగ్యులర్ నియామకాలలో వెయిటేజీ కూడా ఇచ్చింది. దీంతో 80మంది ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. అంతేకాదు.. ఇప్పుడున్న వారిని కూడా దశల వారీగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నిబంధనలకు విరుద్ధంగా…
ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారిలో ఎకువ మంది కరోనా సమయంలో విధుల్లో చేరారు. ఎలాంటి పరీక్ష లేకుండా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా, ఆరు నెలల కాలానికి విధుల్లో చేరిన నర్సులను రెగ్యులరైజ్ చేయాలని కోరడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆందోళన కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నర్సుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నా ఇలాంటి ఆందోళనలు చేపట్టడం సబబు కాదని హెచ్చరించింది. నర్సింగ్ విద్యార్థులకు ైస్టెఫండ్ను రూ.1,500 నుంచి ఏకంగా రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు అందిస్తున్నట్లు ప్రకటించింది.