పహాడీషరీప్, అక్టోబర్ 1: కోట్లు పెట్టి టికెట్ కొనే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.., మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల మధ్యన చిచ్చుపెట్టే బీజేపీ వాళ్లు.. మనకు వద్దని.., నిత్యం ప్రజా సేవ చేసే సబితాఇంద్రారెడ్డిని గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్.1 స్థానంలో నిలిచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. ఇతర రాష్ర్టాల ప్రజలు మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కోరుతున్నారన్నారు. ఆదివారం మంత్రి హరీశ్రావు రంగారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీలో రూ.10లక్షల చొప్పున నిర్మించనున్న జల్పల్లి, శ్రీరామకాలనీల్లో వడ్డెర, పద్మశాలి, లింగాయత్, ఎస్సీ, ముదిరాజ్, గౌడ, కుర్మ, రెడ్డి, వైశ్య, కట్రి, నీలి, ఉప్పరి సంఘాల భవనాల నిర్మాణాలకు శ్రీరామ్ కాలనీలో శంకుస్థాపన చేశారు. అనంతరం కందుకూరులో రూ.176కోట్ల వ్యయంతో చేపట్టనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డి సభాధ్యక్షతన నిర్వహించిన వివిధ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. పట్టుబట్టి సబితక్క మెడికల్ కాలేజీని సాధించారని, ఏడాది కాలంలో మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఈసారి లక్షా పైచిలుకు ఓట్లతో సబితక్క గెలవడం ఖాయమన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లను త్వరలోనే కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పారించి రుణం తీర్చుకుంటామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నీటిగోస
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో మూడు, నాలుగు రోజులకు ఒక్కసారి కూడా తాగునీరు వచ్చేది కాదని, ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అదే పరిస్థితి ఉందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా మండు వేసవిలో సైతం ఎక్కడా నీటి సమస్య లేకుండా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. దేశంలో విద్యా, వైద్యం, తాగు, సాగు నీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.
తెలంగాణ పథకాలు అక్కడ ఎందుకులేవు.?
సీఎం కేసీఆర్ ఇక్కడ స్థిరపడిన అన్ని రాష్ర్టాల ప్రజలను కడుపులో దాచుకొని తెలంగాణ బిడ్డలుగానే చూసుకుంటున్నారని, ప్రభుత్వ పథకాలు వారికీ అందజేస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇక్కడ ఆడబిడ్డల వివాహానికి రూ.లక్షలకు పైగా ఆర్థిక సాయం చేస్తున్నామని, మహారాష్ట్ర, కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఒక్క రూపాయైనా సాయం చేస్తున్నాయా..? అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నామని, ఇవేవి పక్కరాష్ర్టాల్లో లేవన్నారు.
బీజేపీకి రాష్ట్రంలో ఒకటి, రెండు సీట్లు కూడా కష్టమే
మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకోవడమే బీజేపీ పార్టీకి తెలుసని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి, రెండు సీట్లు కూడా గెలవడం కష్టమేనని ఆ పార్టీ నాయకుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించారని మంత్రి హరీశ్రావు అన్నారు.
మోదీ ఎందుకు వస్తున్నారు..?
బీజేపీ 9 ఏండ్లలో పైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వడంలేదని, వెనకబడిన జిల్లాలకు 4 సంవత్సరాలుగా ఆర్థిక సహాయం నిలిపివేసిందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఇప్పుడు మోదీ రాష్ర్టానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీని ఇవ్వాలని 9 ఏండ్ల కిందట పార్లమెంట్లో చట్టం పాసైతే ఈ రోజు వరకు ఇవ్వకుండా అన్యాయం చేశారని తెలిపారు. రైల్వే కోచ్ ప్యాక్టరీ ఇవ్వలేదు, కృష్ణాజలాల విషయంలో తెలంగాణ వాటా తేల్చలేదని అన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీకి 30 పడకల దవాఖాన
సిద్దిపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నిధులు రూ.2 కోట్లు ఇవ్వాలని అడగగానే మంత్రి సబితాఇంద్రారెడ్డి మంజూరు చేశారని మంత్రి హరీశ్రావు చెప్పారు. శ్రీరామకాలనీకి అర్బన్ హెల్త్ సెంటర్, జల్పల్లి మున్సిపాలిటీకి 30 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారని వాటిని వెంటనే సాంక్షన్ చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. అర్బన్ హెల్త్ సెంటర్ను త్వరలోనే మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
రూ.10 కోట్లు ఇస్తే కాంగ్రెస్లో టికెట్
మహేశ్వరం నియోజకవర్గంలో ఎవరెవరో పోటీ చేస్తామంటున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారు కాంగ్రెస్లో రూ.10 కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుంటున్నారని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. మంచితనం, పనితనం లేని వారు ఎన్నికోట్ల రూపాయలు పెడితే ఏం లాభమని విమర్శించారు. ఐదేండ్లకోసారి కోట్లు పెట్టి టికెట్ కొనేవారు మనకొద్దని, 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేసే సబితా ఇంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందజేస్తున్నాం
కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, మందులు అందుబాటులో ఉండేవి కాదని, దీంతో ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారని మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని, అనేక కొత్త దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
మినీ ఇండియా శ్రీరామకాలనీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
శ్రీరామకాలనీలో వివిధ రాష్ర్టాల ప్రజలు జీవిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇదో మినీ ఇండియాగా వర్ణించారు. 12 కులాలకు స్థలం ఇవ్వడమంటే మాములు విషయం కాదని, సీఎం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఉన్న వారు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే అక్కున చేర్చుకోవాలని ముఖ్యమంత్రి చెబుతుంటారని అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో గతంలో ఎలా ఉండే..? ప్రస్తుతం ఎలా ఉన్నదని ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన : ఎంపీ రంజిత్రెడ్డి
రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ట్యాంక్బండ్పై సీఎం కేసీఆర్ బసవేశ్వరుడి విగ్రహాన్ని పెట్టగానే.. కర్నాటకలో కూడా పెట్టారని లింగాయత్ సోదరులు చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, గిడ్డంగుల చైర్పర్సన్ రజిని సాయిచంద్, కమిషనర్ వసంత, కో – ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు శంషోద్దిన్, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, భాషమ్మ, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్దన్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ అఫ్జల్, బీసీ సెల్ అధ్యక్షుడు నిరంజన్, యూత్ అధ్యక్షుడు అర్జున్, సోషల్ మీడియా ఇన్చార్జి వాసుబాబు, డీఈ వెంకన్న, ఏఈ ఆయేశా తదితరులు పాల్గొన్నారు.