ఆర్గాన్ డోనర్స్ డేను పురస్కరించుకొని ఆదివారం గాంధీ మెడికల్ కాలేజీలో అవయవదాతల కుటుంబసభ్యులను మంత్రి హరీశ్రావు సత్కరించారు. వేదికపై తమ వారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైన పలువురిని ఓదార్చారు. అన్ని విధాలా కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అవయవదానంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని చెప్పారు.
సిటీబ్యూరో, నవంబర్ 27 ( నమస్తే తెలంగాణ): అత్యంత విలువైన మనిషి అవయవాలు మట్టిపాలు కావడంకంటే.. మరొకరి ప్రాణాలు కాపాడటం ఎంతో గొప్ప విషయం. ఈ సత్యాన్ని వాళ్లు గుర్తించారు. అవయవదానానికి వారు అంగీకరించారు. శరీర అవయవాలు పాడై.. “మమ్మల్నీ బతికించండి” అంటూ రోదిస్తున్న వారి గాధ విన్నారు. మేమున్నామని వాళ్లిచ్చిన భరోసాతో చాలా మంది చావు నుంచి తప్పించుకుని పునర్జన్మను పొందారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం జరిగిన ఆర్గన్ డోనర్స్ కుటుంబ సభ్యుల సత్కార కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరి అవయవాలను ఇతరులకు అందించి ప్రాణం పోసిన వారిని ఆయన ఘనంగా సత్కరించారు. వేదికపై తమవారిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైన పలువురి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. అన్ని విధాల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
అవయవ దానంతో బతికే ఉన్నాడు
నా భర్త ప్రభుత్వ టీచర్. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఆసుపత్రిలో చేర్పిం చాం. అవయవదానంపై మాకు అవగాహన ఉండటంతో తాను మరణించి ఇతరుల ప్రాణాలు నిలబెట్టాడు. ఇది మాకు గొప్పగా ఉంది. నా భర్త నాలుగు సార్లు ఉత్తమ టీచర్ అవార్డును దక్కించుకున్నాడు. అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పేవాడు. ఆయన మాకు గుర్తొచ్చినప్పుడల్లా ఆయన అవయవదానంతో బతికే ఉన్నారని మనసుకు చెప్పుకుంటా.
– సత్యవతి, జనగాం
నా భర్త ఇతరుల ప్రాణాలను కాపాడాడు
నా భర్త ఆటో డ్రైవర్. ఆటో నడిపితేగానీ రోజు గడవదు. ఇద్దరు పిల్లలు. రోడ్డు ప్రమాదంలో నా భర్త చనిపోయాడు. అవయవదానంపై మాకు అవగాహన లేదు. వైద్యులు మాకు అవయవదానం గురించి వివరించారు. మన అవయవాలు ఇతరులను బతికిస్తాయని చెప్పారు. అందుకు మేం ఒప్పుకున్నాం. ఈ రోజు నా భర్త ఇతరుల ప్రాణాలను కాపాడాడు అని గర్వంగా ఉంది. నా పిల్లలను చదివించేందుకు ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్ముతున్నా.
– భాగ్యలక్ష్మి, సిరిసిల్ల
దత్తత తీసుకొని పెంచుకున్న బిడ్డ దూరమయ్యాడు
నేను మా అక్క కొడుకుని దత్తత తీసుకుని సాదుకున్న. వాడు తినకపోతే పాణం అల్లాడేది. ఎప్పుడూ హుషారుగా ఉంటూ దోస్తులతో సిద్దార్థ్ సందడిగా ఉండేవాడు. చనిపోయాక ఎందుకు మట్టిలో, కట్టెలపై కాల్చుడు చేస్తారు? వారి అవయవాలు ఇతరులకు ఇస్తే బతుకుతరు కదా అమ్మా అని చెప్పేవాడు. చిన్న వయసులోనే అంతటి పెద్ద మాటలు చెబుతుంటే మంచిగ అనిపించేది. కానీ వాడి అవయవాలనే ఈ రోజు ఇతరులకు ఇస్తాడని అనుకోలేదు. ఐదో తరగతిలో జ్వరం భారీగా వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించాం. ఎంతకీ తగ్గలేదు. ఓ రోజు బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పారు. బిడ్డ నానుంచి దూరమయ్యాడు. అవయవదానంతో ఈ రోజు నా బిడ్డ బతికే ఉన్నాడనే సంతోషం ఉంది.
– సీతమ్మ, భద్రాచలం
అవయవ దానం గొప్పది
నా భర్త టవర్ పనిచేస్తుంటే కిందపడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యులు చికిత్స అందించారు. కొన్ని రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. వెంటిలేటర్ తీసేస్తే చనిపోతాడని అన్నారు. ఆయన ఎప్పుడూ మరొకరి మేలు కోరుకునేవాడు. ఇతరులకు సహాయం చేయాలనుకుంటాడు. మాది పేద కుటుంబం. మాకు ముగ్గురు పిల్లలు. బతికున్నప్పుడు అవయవదానం చేయాలని అందరికీ చెప్పేవాడు. వైద్యుల సూచన మేరకు అంగీకరించాం. అవయవదానం గొప్పది. అందరూ ముందుకొచ్చి ఇతరుల ప్రాణాలు నిలబెట్టాలి.
– సుధ, సికింద్రాబాద్