“కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో కులం పేరుతో కుంపట్లు పెట్టలేదు.. మతం పేరుతో మంటలు పెట్టలేదు.. ప్రాంతం పేరుతో పంచాయతీ పెట్టలేదు.. హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉన్నది.. అభివృద్ధికి ఓటు వేస్తే విశ్వనగర సాధనకు తామేమి చేస్తామనేది కేటీఆర్ ప్రతి చోట రోడ్ షోలలో సోదహరణంగా వివరిస్తూ సాగారు.”
“అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? పొరపాటుగా తప్పుచేస్తే హైదరాబాద్ అభివృద్ధి ఆగమైతది.. మళ్లీ ఆ చీకటి రోజులు వస్తాయి.. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా ప్రజల వెంట ఉన్నది బీఆర్ఎస్ పార్టీయే. హైదరాబాద్లో ఉన్నోళ్లంతా మా వారే, మా బిడ్డలే.”
“ బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కష్టాలు లేవు.. కంపెనీలు వస్తున్నాయి.., సంపద పెరుగుతున్నది.. ఉపాధి దొరుకుతున్నది.. దేశంలోని లక్షల మందికి అమ్మలా అన్నంపెడుతున్న హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉన్నది.”
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ ఎన్నికల సంగ్రామంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు చేపట్టిన రోడ్ షోలు సూపర్హిట్ అయ్యాయి. 10 రోజుల పాటు 17 నియోజకవర్గాలను చుట్టేసి దాదాపు 40కి పైగా కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల చొప్పున రోడ్ షోలు నిర్వహించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో నాలుగు నుంచి ఆరు చోట్ల వేదికల ద్వారా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నియోజకవర్గం ప్రాముఖ్యత, డివిజన్లలో ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను సభలకు హాజరైన ప్రజలకు పూసగుచ్చినట్టు వివరిస్తూ ఆకట్టుకున్నారు. మంత్రి తనదైన శైలిలో సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తున్నంతసేపు జనం నుంచి విశేష స్పందన లభించింది. మంత్రి కేటీఆర్ తనదైన మార్కు ప్రచారానికి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రతి రోడ్షోలో అడుగడుగునా జనప్రభంజనం కనిపించింది.
కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, నాంపల్లి, ఉప్పల్, గోషామహల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మలక్పేట నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ తనదైన మార్కు ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలు.. బహిరంగ సభలా? విజయ యాత్రలా..? అనే రీతిలో జరిగాయి. అన్ని చోట్ల భారీగా తరలివచ్చి తారక రాముడికి జన హారతి పట్టారు. ముఖ్యంగా మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. డప్పు, చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, బోనాలతో గల్లీలు, కాలనీల్లో హోరెత్తించారు. ఎక్కువగా రోడ్ షోలకు యువత భారీగా తరలివచ్చారు. దీంతో రోడ్ షో ప్రాంతాలలో ఎటు చూసినా ప్రభంజనమే కనిపించింది. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా జనం వెల్లువలా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ నుంచి అమిత్షా, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారం చేపట్టగా.. బీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్ ఒక్కడే అన్నీ తానై సమర్థవంతంగా ప్రచారంలో రాణించారు.
తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి మీ కళ్లముందే ఉన్నది. నికరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనితీరుకు.. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు గుర్తించాలని, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా పాలన అందించామని మంత్రి కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో పవర్ హాలిడేలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల కష్టాలను వివరించారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే హైదరాబాద్ కర్ఫ్యూ నీడలో గడుపుతుందనే చరిత్రను ప్రజల ముందు ఉంచారు. స్వార్ధ రాజకీయాలతో పాటు శాంతిభద్రతల నిర్వహణలో ఆ పార్టీ విఫలమైనప్పుడు తలెత్తిన కల్లోలాలను వివరించారు. బీఆర్ఎస్ పాలనలో ముందెన్నడూ లేనివిధంగా అభివృద్ధిలో దూసుకువెళ్తున్నదని, హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో సంవత్సరానికి నాలుగు సార్లు కర్ఫ్యూ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం నాలుగు సెకన్లు కూడా కర్ఫ్యూ పెట్టలేదని తెలిపారు. శాంతిభద్రతలు, నగర జీవన ప్రమాణాలు పెంచామని, ఇక్కడ ఉంటున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నామంటూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నదని, ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వచ్చే టర్మ్లో హైదరాబాద్లో 24 గంటల తాగునీరు, డ్రైనేజీ, చెరువులను బాగుపర్చుకుందామని కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళకు సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి నెల రూ.3వేలు, ఆసరా పెన్షన్లు పెరుగుతాయని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని కేటీఆర్ చెప్పా. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమా కార్యక్రమం ద్వారా రూ.5లక్షల జీవితబీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. మోడీ పాలనలో రూ.400 సిలిండర్ రూ.1200కు చేరిందని.. డిసెంబర్ 3 తర్వాత పెంచిన రూ.800లను కేసీఆర్ ప్రభుత్వమే భరించి ఆడబిడ్డలకు రూ.400లకే సిలిండర్లు అందజేస్తామన్నారు. ప్రజలు సైతం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు గులాబీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారు.
రోడ్ షోలకు వచ్చిన జన స్పందన చూసి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. పోలింగ్ ముగిసే వరకు మరింత కష్టపడి పనిచేయాలనే పట్టుదల వారిలో కనబడుతున్నది. కాలనీలు, బస్తీల్లో కాంగ్రెస్, బీజేపీల వంచనను వివరించాలన్న ఉత్సాహం వారిలో నెలకొన్నది. రోడ్ షోలు సూపర్హిట్ అయ్యాయని, తమకు, తమ యువనేత కొత్త జవసత్వాలు అందించారని, ఈ స్ఫూర్తితో ఎన్నికలు అయిపోయేంతవరకు అవిశ్రాంతంగా పనిచేస్తామని కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ప్రకటిస్తుండడం విశేషం.