సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణకు ఎనలేని ద్రోహాలు చేస్తూ ఏ మొఖం పెట్టుకొని బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగానికి వస్తున్నారని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. బీజేపీ ద్వంద విధానాల్ని ఎండగట్టాలని, గల్లీలో ఒకటి చెప్తూ ఢిల్లీలో తెలంగాణపై కక్ష తీర్చుకొనే వారి దుర్మార్గ వైఖరిని ఓటర్లకు వివరించాలని గంగుల కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం జిల్లా డివిజన్ ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశమై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆత్మగల పార్టీ కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని, పార్టీని కాపాడుకోవడం అంటే తెలంగాణను కాపాడుకోవడమేనని సూచించారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, అలాంటి పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్త 50 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను కలువాలని, వారి సమస్యల కోసం మన అభ్యర్థి సురభివాణీదేవి తన గళం వినిపిస్తారని చెప్పాలన్నారు. కేవలం ఆరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధి సాధించిన రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని, ఏ ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణలో బీజేపీ నాటకాలు సాగవన్నారు. కచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, బ్రహ్మాండమైన మెజార్టీతో సురభి వాణీదేవి గెలుపు కోసం ప్రతీ కార్యకర్త శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిలు కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పెట్టిన పథకాలే పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభివాణీదేవికి మద్దతుగా నారాయణగూడలోని రాజా బహుద్దూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యావంతురాలైన సురభి వాణీదేవి గెలుపునకు సహకరించాలని రెడ్డి మహిళా కళాశాల గ్రాడ్యుయేట్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే టీఆర్ఎస్ పార్టీకే ఈ పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శారద,వైస్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.