సిటీబ్యూరో/మాదాపూర్, మే 5 (నమస్తే తెలంగాణ): దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కేక్ కట్ చేసిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ జి.మల్లేశ్తో పాటు రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజయ్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్లకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ డా.వినిత్ స్పందించారు. కేబుల్ బ్రిడ్జిపై కేక్ కటింగ్ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని డీసీపీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల కేబుల్ బ్రిడ్జ్పై సెల్ఫీలు తీసుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి, ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తోటి ఇన్స్పెక్టర్లతో కలిసి కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే వేడుకలు జరుపుకోవడమేంటని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు స్పందించి సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫొటోలపై విచారణకు ఆదేశించారు.