ఘట్కేసర్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోనే బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ మూడో వార్డు లక్ష్మీనర్సింహ కాలనీ నుంచి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో కౌన్సిలర్ చింతల రాజశేఖర్, చైర్మన్ కొండల్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందన్నారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
పోచారం అభివృద్ధికి ప్రభుత్వం కృషి..
కొత్తగా ఏర్పడిన పోచారం మున్సిపాలిటీ సంపూర్ణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు. మున్సిపాలిటీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ, సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ధనలక్ష్మి, సాయిరెడ్డి, సరిత, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.