మేడ్చల్ / మేడ్చల్ రూరల్ / శామీర్పేట/ ఘట్కేసర్/పీర్జాదిగూడ, అక్టోబర్ 9: అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంతో ఎత్తులో ఉన్న గోదావరి నీళ్లను గడగడపకు తీసుకువచ్చి, మహిళల నీటి కష్టాలను తీర్చిన మహానేత అని కొనియాడారు. సోమవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ, తూంకుంట, పోచారం మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ ఓహెచ్ఆర్ఎస్, సంపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల పరిపాలనలో ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కోసం ప్రజలు ఎన్నో తిప్పలు పడ్డారన్నారు. పల్లెల్లో బిందెలు పట్టుకుని కిలో మీటర్ల దూరంలో ఉన్న బోరుబావుల వద్దకు వెళ్లాల్సి వస్తే, నగరాలు, పట్టణాల్లో గంటల తరబడి నీళ్లు కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీటితో పాటు సాగునీటిని అందిస్తున్నారన్నారు. గోదావరితో పాటు కృష్ణా జలాలను కూడా వినియోగంలోకి తీసుకువచ్చారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పైపులైన్ల ద్వారా శుద్ధి చేసిన గోదావరి తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందిస్తున్నదని చెప్పారు. ప్రతి రోజు నల్లా నీటిని అందించడంతో ఆడబిడ్డల నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో సుమారు 30 ఏండ్ల వరకు పెరిగే జనాభాకు నీటి కష్టాలు లేని విధంగా ప్రణాళికతో మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించారని తెలిపారు. ప్రజా సమస్యలను తీర్చడంతో పాటు కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి కేవలం ఈ తొమిదిన్నరేండ్లలో జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కండ్ల ముందు కన్పిస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని కాదని, ప్రతిపక్షాలను ఓటేస్తే గోస పడక తప్పదని అన్నారు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్న సీఎం కేసీఆర్ను మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కే లేదన్నారు. ప్రజలకు ఏమీ చేయని బీజీపీ, కాంగ్రెస్లు ప్రజలను గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు.
గుండ్లపోచంపల్లిలో మున్సిపాలిటీ మైసమ్మగూడలో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన మిషన్ భగీరథ ఓహెచ్ఆర్ఎస్ను, 10 లక్షల లీటర్ల నీటి సంపును మంత్రి ప్రారంభించారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, మున్సిపల్ కౌన్సిలర్లు పెంటయ్య, జైపాల్రెడ్డి, బాల్రాజ్, హేమంత్రెడ్డి, వీణా సురేందర్ గౌడ్, రాజకుమారి, అంథోనమ్మ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు వెంకటేశ్, జనార్దన్రెడ్డి, దేవేందర్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తూంకుంట మున్సిపాలిటీలో 7వ వార్డులో నిర్మించిన మిషన్ భగీరథ నీటి ట్యాంకును మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ పన్నాల వాణివీరారెడ్డి, కమిషనర్ జేతూరామ్నాయక్, కౌన్సిలర్లు ఎద్దు లక్ష్మీ నాగేశ్యాదవ్, పాండు, సురేశ్, నర్సింగ్రావుగౌడ్, రాజ్కుమార్యాదవ్, కో ఆప్షన్ సభ్యులు షఫి ఉల్లాబేక్, శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీ 1వ వార్డు ఇస్మాయిల్ఖాన్గూడ, 3వ వార్డు గాంధీనగర్లో నిర్మించిన మిషన్ భగీరథ మంచి నీటి రిజర్వాయర్లను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ వేమనరెడ్డి, కౌన్సిలర్లు మహేశ్, రాజశేఖర్, బాల్రెడ్డి, సాయిరెడ్డి, జలమండలి జీఎం శ్రీనివాస్రెడ్డి, మేనేజర్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడిపల్లిలో రూ. 2.86 కోట్లతో 2ఎంఎల్ కెపాసిటీ ఓవర్హెడ్ ట్యాంక్, పీర్జాదిగూడ గుట్ట పై రూ. 6.16 కోట్లతో 5ఎంఎల్ కెపాసిటీ కలిగిన మంచినీటీ రిజర్వాయర్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కమిషనర్ ఇస్లావత్ నమ్య, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.